దీక్షిత రామాయణం
(5వ భాగం )
************
కలలోనో.. లేక ఇలలోనో తాను ఆనాడు విన్నది మహామహితాత్ముడైన ఒక దివ్యపురుషుని గురించిన విషయం అనే స్పృహ వాల్మీకిలో
స్పష్టంగా ఉంది. ఆ సత్పురుషుని సమాచారం తెలియాలంటే.. ఇదీ అని విస్పష్టంగా
చెప్పజాలని ఆయన విశిష్టతను తెలుసుకోవాలంటే..అంత సులువేమీ కాదు. ఒక
ఉత్కృష్టమైన వస్తువును తాను తెలుసుకోగోరుతున్నాను అనే జ్ఞానంతో వాల్మీకి
నారదుడ్ని ఇలా ప్రశ్నించాడు,
"దేవర్షీ.. మీరు త్రికాల వేదులు,
సర్వలోక సంచారులు, సదా హరినామ స్మరణతో వాక్శుద్ధి పొందిన
సత్యవాక్పరాయణులు.. మీకు తెలియని విశేషం గానీ, మీరు తెలియజాలని విషయం గానీ
ముల్లోకాలలో ఎక్కడా ఉంటాయని నేను భావించడం లేదు. అందుకే నేను మిమ్మల్ని ఒక
విషయం అడగదలచాను.. ఇది చాలా కాలంగా నా మదిలో ఉన్న ఒక ఆర్తికి ఆధారమని
భావించండి.. నేనేది అన్వేషిస్తున్నానో అది నాకు అందజేయండి.." అని కోరాడు
సవినయంగా.
నారదుడు ఎంతో సంతోషించాడు వాల్మీకి పలుకులకు.
మహర్షీ! విద్వత్తు మురిసేలా మాట్లాడావు. నీ ఆకాంక్ష సముచితమైనది..నీవేది
అడిగినా నా తల్లి సరస్వతి అనుగ్రహంతో అది నీకు తెలియజెప్పే ప్రయత్నం
చేస్తాను. నిస్సంకోచంగా అడుగు. " అన్నాడు నారదుడు.
స్వామీ..
లోకంలో ఇదుగో ఈతడు మహాపురుషుడు.. ఇతడే సర్వోన్నతుడు, నరోత్తముడు.. అని
ఎవర్ని సంబోధించాలి? అటువంటి విశిష్ట వ్యక్తిత్వం ఎవరికి ఉంది? మహా వీరుడై
ఉండీ ఆశ్రిత రక్షకుడు ఎవడు? శక్తికి ప్రతిరూపమై కూడా శాంతి కాముకుడైన
వాడేవడు? మాతాపితరుల ఎడల అమిత భక్తి పరుడు ఎవడు? సోదర బంధుమిత్ర జన
సపరివారాదులపై వాత్సల్యం చూపు సద్గుణ సంపన్నుడు ఎవడు? యుద్ధం వస్తే
ప్రపంచాన్నయినా నిలువరించగల ధీరుడు ఎవడు. భూదేవిని మించు సహనశీలి ఎవడు?
తనను ఆశ్రయించిన వారిపై ఎనలేని దయజూపు మహారాజు ఎవడు? మర్యాదా
పురుషోత్తముడు, మాట ఇస్తే అటు సూర్యుడు ఇటు పొడిచినా వెనుకాడని
సత్యసంధుడు.. ధర్మపరుడు, నిగర్వి, వాగ్భూషణుడు..శాస్త్రవిహిత కర్తవ్యాన్ని
ఎన్నడూ విస్మరించని కర్మయోగి.. అంతెందుకు అన్నివిధాలా ఈ జగతిలో
అత్యున్నతుడు ఎవడు? అట్టి పరిపూర్ణ మానవుని గురించి నాకు దయతో తెలియజెప్పి
నన్ను చరితార్థుడ్ని చేయండి" అని వేడుకున్నాడు వాల్మీకి.
మహర్షి
ప్రార్థన వినగానే నారదుడికి పరమానందమైపోయింది. ఈ ప్రశ్న వాల్మీకి నోట
పలకడానికి వెనుక గల ఆధ్యాత్మిక పరమార్థం నారదునికి అర్థమైపోయింది.ఇప్పటి
వరకూ తనకు మాత్రమె తెలిసిన శ్రీరామ కథ అనే దివ్య సుధ ఇక జగతి జనులను ఆచంద్ర
తారార్కం తరింప జేసేందుకు ఒక సద్గ్రంథమై భువిని అవతరించే శుభ తరుణం
ఆసన్నమైనదని తెలిసి మహాదానందభరితుడయ్యాడు.
పట్టలేని ఆ మహదానందంతో.. ఒడలు పులకరిస్తుండగా, గొంతు కంపిస్తుండగా.. ఇలా చెప్పుకొచ్చాడు దేవర్షి...
"వాల్మీకి మునిపుంగవా! సూర్య వంశమున ఉద్భవించిన కారణ జన్ముడు శ్రీరామ
చంద్రమూర్తి. సకల శుభ లక్షణ సంజాతుడు, సర్వ సద్గుణ విరాజితుడు అయిన
దివ్యపురుషుడు రాముడు.
నీవు అడిగిన అన్ని శుభ గుణాలు ఆయనలో
ద్విగుణీకృతమై భాసిస్తాయి. ఉత్క్రుష్టతకు, విశిష్టతకు, ఉన్నతికి ఆయన
నెలవు.. మానవత్వానికి, పరాక్రమానికి సాటిలేని కొలువు. అయోధ్యా
సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఈ రాజు రూపురేఖా విలాసాలలో చంద్రుని మించిన
అందగాడు. సహనము, పరోపకార చింతనలో భూమిని అధిగమించిన వాడు.. పరాక్రమమున
ఇతడికి సాటి ముల్లోకాలలోనూ లేడు, ధర్మ నిర్ణయంలోనూ,స్వధర్మ పాలనలోనూ
సర్వలోకాలకూ ఆదర్శప్రాయుడు.. శరణాగత రక్షణలో పక్షపాతం ఎంచని ఏలిక, ప్రజలను
బిడ్డలుగా చూచువాడు.. గురువులను పసివాని వలె సేవించు వాడు.. ఏకపత్నీ
వ్రతుడు, ఒక్క బాణమే సర్వ శత్రు హరణమని పేరొందిన వాడు, సోదరులకు పెన్నిధి..
భూమండలం సమస్తానికీ సార్వభౌముడు కాగల ఒకేఒక సత్పురుషుడు.. అందరికీ
ఆత్మబంధువు.. ప్రణవ స్వరూపుడు.. అతడే శ్రీరామ చంద్రుడు... అంటూ వివరించాడు
నారదుడు.